ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా ఆహ్వానాన్ని మన్నించి.. ఏపీ ఎన్నికల్లో కలెక్టర్ల వినూత్న ప్రయోగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 10, 2024, 07:31 PM

ఏపీ ఎన్నికల్లో ప్రచార పర్వం క్లైమాక్స్‌కు చేరుకుంది. పార్టీలన్మీ ఈ కొన్ని గంటల్లో ఓటర్లను ఆకర్షించేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. తమకే ఓటు ఎందుకు వేయాలో, వేస్తే ఏం లాభం జరుగుతుందనేదీ వివరిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీబిజీగా ఉన్నాయి. పార్టీలన్నీ ఈ రకమైన ప్రయత్నాల్లో ఉంటే.. ఏపీలోని కొంతమంది కలెక్టర్లు మాత్రం రొటీన్‌కు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు.. ఓటర్లను పోలింగ్ బూత్‌ల వద్దకు తీసుకువచ్చేందుకు తమ క్రియేటివిటీని ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే అంబేద్కర్ కోనసీమ, విశాఖ జిల్లాల కలెక్టర్లు చేస్తున్న వినూత్న ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. తమ జిల్లాలోని ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ బూత్ వద్దకు వచ్చి నిర్భయంగా ఓటేసేందుకు హిమాన్షు శుక్లా.. కాస్త క్రియేటివ్‌గా ఆలోచించారు. పెళ్లిళ్లకు రావాలంటూ ఎలా ఆహ్వానపత్రికలు పంపుతామో.. అలాగే పోలింగ్ పండుగలో పాల్గొనాలంటూ ఆహ్వాన పత్రికలు పంపుతున్నారు హిమాన్షు శుక్లా. ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలు డిజైన్ చేయించి.. మే 13వ తేదీ జరిగే పోలింగ్‌లో పాలుపంచుకోవాలంటూ ఓటర్లకు పంపుతున్నారు.


ఎన్నికల పండుగ అయిన మే13న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ కేంద్రానికి వచ్చి.. తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటేయాలని ఆహ్వానపత్రికలో కోరుతున్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల ఎన్నికల మహోత్సవానికి హాజరై మీకు నచ్చిన వారికి ఓటేయాలని కోనసీమ కలెక్టర్ ఆహ్వాన పత్రికలో కోరారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఈ ఆహ్వాన పత్రికలు డిజైన్ చేయించి ఓటర్లకు పంపగా.. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరోవైప విశాఖ కలెక్టర్ మల్లిఖార్జున సైతం ఇదే రీతిలో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు ఆహ్వానిస్తున్నారు.ఈనెల 13న ఎన్నికల పండగలో ఓటర్లు అందరూ భాగస్వాములు కావాలంటూ ఆహ్వాన పత్రికను ముద్రించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని.. ఎన్నికల పండుగలో పాల్గొని తమకు నచ్చినవారికి ఓటేయ్యాలని కోరారు. మొత్తానికి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈ ఐఏఎస్ అధికారులు చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. మరి వీరి ఆహ్వానాన్ని ప్రజలు ఎంతమేరకు మన్నిస్తారనేదీ చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com