ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల వేళ కొత్త కష్టాలు.. ఇవేం ఛార్జీలయ్యా బాబూ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 10, 2024, 07:23 PM

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ఎన్నికల కోలాహలం నెలకొంది. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీ ఏపీ, తెలంగాణలో ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. ఉపాధి, ఇతరత్రా అవసరాల కోసం సొంతూర్లు వదిలేసి నగరానికి వచ్చిన ప్రజలు.. ఓటేసేందుకు ఊళ్లకు బయల్దేరుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి ఏపీలోని సొంతూర్లకు పయనమవుతున్న వారికి బస్సు ఛార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సైతం ప్రత్యేకబస్సులు ఏర్పాటు చేసింది. అయితే ఈ బస్సుల్లో, రైళ్లల్లో సీట్లు నిండిపోగా.. ప్రజలు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు.


ఈ నేపథ్యంలో సందట్లో సడేమియాలా మారింది ప్రైవేట్ ట్రావెల్స్ తీరు. డిమాండ్‌ను అవకాశంగా మలుచుకుని దోపిడీకి పాల్పడుతున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రధాన నగరాలకు ప్రైవేట్ బస్సుల్లో ఛార్జీల వివరాలు చూస్తే గుండె గుభేల్‌ మనకతప్పదు. బస్సు కంటే ఫ్లైట్ ఛార్జీలే నయంరా దేవుడా అనుకోకుండా ఉండలేరు. ఎందుకంటే సాధారణ ఛార్జీలకు తోడు అదనపు ఛార్జీల పేరిట ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు నిలువు దోపిడీకి తెరలేపాయి. సాధారణ ఛార్జీల మీద రూ.1000 నుంచి రూ.1500 వరకు అధికంగా వసూలు చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ, తిరుపతి వంటి నగరాలకు స్లీపర్ బస్సుల్లో టికెట్ ధరలు రూ.2 వేల నుంచి రూ.3 వరకూ ఉంది.


అయితే మే 11 నుంచి ఈ టికెట్ రేట్ల పెరుగుదల కనిపిస్తోంది. మే 11 రెండో శనివారం కావటం, మే 12 ఆదివారం, మే 13 పోలింగ్ రోజు కావటంతో..చాలా మంది శుక్రవారం రాత్రి లేదా శనివారం సొంత ఊరికి పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో మే 11 నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు టికెట్ రేట్లు పెంచాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు సాధారణ రోజుల్లో టికెట్ ధరలు 500 నుంచి రూ.1000 వరకూ ఉంటాయి.


అయితే ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో స్లీపర్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ టికెట్ రేట్లు రూ.2500 నుంచి రూ.3000 వరకూ చూపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి కడప, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి వంటి ప్రధాన నగరాలకు కూడా ఇదే రేంజులో టికెట్ రేట్లు ఉన్నాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల కంటే విమానాల్లో ప్రయాణం చవకంటూ నెటిజనం కామెంట్లు పెడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com