ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామకృష్ణ మిషన్‌ అధ్యక్షుడు స్వామి స్మరణానంద శివైక్యం

national |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 10:35 PM

రామకృష్ణ మిషన్‌, రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి స్మరణానంద (95) శివైక్యం చెందారు. వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మంగళవారం రాత్రి 8.14 గంటలకు స్మరణానంద తుదిశ్వాస విడిచినట్టు రామకృష్ణ మిషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి 29న మూత్రనాళం ఇన్‌ఫెక్షన్‌తో స్వామి స్మరణానంద రామకృష్ణ మిషన్‌ సేవా ప్రతిష్ఠాన్ (ఆస్పత్రి)లో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించి, శరీరంలో ఒక్కో అవయవం దెబ్బతింది. మార్చి 3 వరకూ స్వామీజీ వెంటిలేటర్‌పై ఉన్నారు. రామకృష్ణ మిషన్‌, మఠానికి 17వ అధ్యక్షుడిగా 2017లో స్వామి స్మరణానంద బాధ్యతలు స్వీకరించారు. బుధవారం బేలూరు మఠంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సర్మణానంద శివైక్యం చెందినట్టు తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.


ఎక్స్‌ (ట్విట్టర్)లో తన సంతాపాన్ని తెలిపిన ప్రధాని... ‘రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ గౌరవ అధ్యక్షులు శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహరాజ్ తన జీవితాన్ని ఆధ్యాత్మికతకు, సేవకు అంకితం చేశారు.. లెక్కలేనన్ని హృదయాలు, మనసులపై చెరగని ముద్ర వేశారు.. ఆయన కరుణ, వివేకం తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.. కొన్నేళ్లుగా ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది.. 2020లో బేలూరు మఠాన్ని సందర్శించినప్పుడు ఆయనను కలిసి మాట్లాడాను.. కొన్ని వారాల కిందట కోల్‌కతాలో కూడా ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశాను. బేలూరు మఠంలోని అసంఖ్యాక భక్తులతో నా ఆలోచనలు ఉన్నాయి. ఓం శాంతి' అని మోదీ సందేశం పోస్ట్ చేశారు. మార్చి 5న బెంగాల్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.


పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్వామీజీ మరణంపై సంతాపం తెలిపారు. ‘రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ గౌరవనీయ అధ్యక్షులు శ్రీమత్ స్వామి స్మరణానందజీ మహరాజ్ మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులకు ఆయన ఓదార్పు వనరుగా ఉన్నారు. తోటి సన్యాసులు, అనుచరులు, భక్తులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను..’ అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com