విశాఖపట్నం జిల్లా, పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు ప్రాంతానికి చెందిన గురివెల్లి శ్వేత (24) మృతిపై న్యూపోర్టు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలి భర్త అత్తమామలతో పాటు ఇంటికి ఇరుగుపొరుగునున్న వారిని సీఐ ఎస్.రాము గురువారం విచారించారు. పెళ్లైన ఏడాదికే శ్వేత తనువు చాలించడానికి గల కారణాలు ఏమిటనే కోణంలో ఆరా తీస్తున్నారు. కట్నం కోసం అత్తింటివారు వేధించడం వల్ల మృతిచెందిందా లేకుంటే భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయా అనే విషయంపై విచారణ చేస్తున్నారు. ఇంజనీరింగ్ చేసిన శ్వేత ఉన్నత చదువులు చదువుకునేందుకు యత్నించగా అత్తింటి వారు అభ్యంతరం తెలిపారని, ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చాయని భావిస్తున్నారు.