తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు పగటికలలు కంటున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటామిరెడ్డి అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం ఉందని, కేవలం కేడర్ను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు తంటాలు పడుతున్నారని తెలిపారు. నగరంలోని 40వ డివిజన్లో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ఆయా కుటుంబాలకు కలిగిన లబ్ధిని వివరించారు. స్థానికంగా సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ.... వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాక అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. సుమారు ఏడాది కాలంగా గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల గడప వద్దకు వెళ్తున్నామని, జగన్ నాయకత్వం పట్ల ప్రజల్లో మరింత నమ్మకం పెరిగిందన్నారు.