మణిపూర్ నుంచి ప్రత్యేక విమానంలో తెలుగు విద్యార్థులు క్షేమంగా చేరుకొన్నారు. ఇదిలావుంటే మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. అక్కడ చాలా మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చిక్కుకున్నారు. అయితే.. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుని విద్యార్థులను తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేశారు. ఇందులో భాగంగా.. ఈరోజు 72 మంది విద్యార్థులు క్షేమంగా హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి మల్లారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జిల్లా కలెక్టర్ హరీష్తో పాటు.. పోలీస్ అధికారులు మహేష్ భగవత్, శంషాబాద్ సీపీపీ నారాయణరెడ్డి తదితరులు.. విద్యార్థులకు స్వాగతం పలికారు. తెలుగు విద్యార్థులను రాష్ట్రానికి తిరిగి తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మణిపూర్ ఇంఫాల్ నుంచి ఇండిగో ఎయిర్ లైన్స్కు చెందిన ప్రత్యేక విమానంలో 72 మంది విద్యార్థులు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి నగరానికి తీసుకెళ్లేందుకు నాలుగు ప్రత్యేక బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు.
అయితే.. మణిపూర్లో విధ్వంసఖాండ జరుగుతున్న నేపథ్యంలో.. తమకు ఎదురైన అనుభవాలను విద్యార్థులు మీడియాతో పంచుకున్నారు. తాము ఉన్న ప్రాంతంలో దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయని.. ఈ క్రమంలో తమకు ఎన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ హాస్టళ్లలో ధైర్యంగా ఉన్నామని విద్యార్థులు తెలిపారు. ఐదు రోజులుగా.. ఇంటర్నెట్ పూర్తిగా పనిచేయలేదని.. కనీసం ఆహారం కూడా లభించలేదని.. పస్తులున్నామంటూ విద్యార్థులు తాము ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిపారు. కొంత మంది దుండగులు తాగే నీళ్లలో కూడా విష పదార్థాలు కలిపే ప్రయత్నాలు చేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవ కారణంగా తామంతా క్షేమంగా తిరిగి వచ్చామన్న విద్యార్థులు.. తమను సురక్షితంగా తీసుకొచ్చిన కేసీఆర్ సర్కారుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.