తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఇటీవల మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలను ఆయన వెల్లడించారు. తెలంగాణ రాజకీయాల్లో విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారని ఆయన ప్రశంసించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలోనూ విద్యార్థుల పోరాటం వెన్నెముకగా నిలిచిందన్నారు. తెలంగాణలో జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉందన్నారు. తమ పార్టీకి ప్రతి నియోజకవర్గంలోనూ ఓటర్ల మద్దతు ఉందని స్పష్టం చేశారు.
కొన్ని అనివార్య కారణాల వల్ల గత ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపలేకపోయినట్లు ఆయన వివరించారు. వచ్చే ఎన్నికల్లో పరిమిత సంఖ్యలో అయినా తెలంగాణలో పోటీ చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలో పార్టీని పటిష్టం చేయాలని, రానున్న ఎన్నికల్లో పార్టీ జెండాను రెపరెపలాడించాలని కార్యకర్తలకు సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా, కొన్ని కారణాల వల్ల తన మాటను మన్నించి పార్టీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారన్నారు. అయితే వచ్చే ఎన్నిక్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అంతా కలిసి పని చేయాలన్నారు.