హైదరాబాద్లోని అవేర్ గ్లోబల్ హాస్పిటల్ వైద్యుల ఓ కీలక విషయాన్ని తెలియజేశారు. ఓ వ్యక్తికి గంటపాటు సర్జరీ చేసి కిడ్నీలో ఉన్న 206 రాళ్లను తొలగించామని తెలిపారు. సర్జరీ అనంతరం ఆ రాళ్లను అతని కుటుంబ సభ్యులకు వైద్యులు చూపించడంతో ఒక్కసారిగా షాకయ్యారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం. "నల్లగొండ జిల్లాకు చెందిన వీరమళ్ల రామకృష్ణయ్య(56) ఆరు నెలల క్రితం కడుపులో నొప్పి రావడంతో స్థానిక వైద్యుడిని సంప్రదించాడు. ఆ డాక్టర్ ఇచ్చిన మందులు వాడటంతో నొప్పి తగ్గిపోయింది. కానీ, ఆ నొప్పి క్రమ క్రమంగా అధికమైంది. భరించలేని నొప్పి రావడంతో హైదరాబాద్లోని అవేర్ గ్లోబల్ హాస్పిటల్ వైద్యులను సంప్రదించాడు. రామకృష్ణయ్యకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా, కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. దాంతో బాధితుడికి గంటపాటు వైద్యులు సర్జరీ చేసి, 206 రాళ్లను బయటికి తీశారు. ప్రస్తుతం రామకృష్ణయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.