ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసులపై ఉగ్రపంజా..ఒక కానిస్టేబుల్ మరణం

national |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 03:50 PM

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ కానిస్టేబుల్ ప్రాణాలను హరించారు. అంతేకాదు ఈ దాడిలో ఓ చిన్నారి సైతం తీవ్రంగా గాయపడింది. ఉగ్రవాదులపై పోలీసులు విస్త్రుతంగా గాలిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలో సౌరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను హతమార్చారు. అంచర్‌లోని కానిస్టేబుల్ ఇంటి వెలుపల టెర్రరిస్టులు వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ ఏడేళ్ల కుమార్తె కూడా గాయపడింది. సైఫుల్లా ఖాద్రీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడని జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. తన కుమార్తెను ట్యూషన్ క్లాస్‌కి దింపేందుకు ఇంటి నుంచి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ దాడి జరిగిందని వెల్లడించారు.


ఈ కాల్పుల్లో గాయపడిన పోలీస్ కానిస్టేబుల్‌ సైఫుల్లా ఖాద్రీని, అతని కుమార్తెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఖాద్రీ మృతి చెందాడు. దీంతో ఆ అమరవీరుడికి నివాళులు అర్పిస్తున్నామని, ఆ కుటుంబానికి అండగా ఉంటామని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు. అలాగే చిన్నారి కుడి చేతికి బుల్లెట్ గాయమైందని, అయితే పాపకు ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.


అయితే ఈ దాడిని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ ఖండించారు. ఆ ఉగ్రవాదుల కోసం పోలీసు బృందాలు రంగంలోకి దిగాయని, త్వరలో పట్టుకుంటామని ఆయన చెప్పారు. ఈ నెలలో కశ్మీర్‌లో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న మూడో పోలీస్ కానిస్టేబుల్ ఖాద్రీ. అంతకుముందు మే 7న అంచర్ ప్రాంతానికి సమీపంలోని ఐవా వంతెన వద్ద ఉగ్రవాదులు ఒక పోలీసులను కాల్చి చంపారు. మే 13న పుల్వమా జిల్లాలో మరో పోలీసు మరణించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com