నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో సోమవారం జరిగిన ఈ ఘటనలో ప్రేమికుడు గల్లంతవగా యువతిని పోలీసులు కాపాడారు. హాలియా ఎస్సై క్రాంతికుమార్ వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం నర్లెంగతండాకు చెందిన రమావత్ లింగకు ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తె అనితను నాలుగేళ్ల క్రితం ఏపీలోని మాచర్ల మండలం రేగులవరం గ్రామానికి చెందిన వడ్డ్యా బిచ్చ్య పెద్ద కుమారుడు బాబూరావుకు ఇచ్చి వివాహం జరిపించారు.
వీరికి ఇద్దరు ఆడపిల్లలు కాగా.. తొమ్మిది నెలల క్రితం అనిత ఆత్మహత్య చేసుకుంది. ఆమె పిల్లల బాగోగుల దృష్ట్యా లింగ.. చిన్న కుమార్తె నందిని (18)ని సైతం బాబురావుకు ఇచ్చి వివాహం జరిపిద్దామని ఇంట్లో మాట్లాడారు. అప్పటికే నందిని, బాబూరావు సొంత తమ్ముడైన బాలకృష్ణ (21) ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో ప్రస్తావించిన పెళ్లి విషయాన్ని నందిని బాలకృష్ణకు తెలిపింది. ఈ పెళ్లిని ఒప్పుకోలేక, ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ఇద్దరూ ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుని ప్రణాళిక ప్రకారం సోమవారం ఉదయం హాలియాకు చేరుకున్నారు.
రామాలయం వద్ద గల వంతెన పై నుంచి సాగర్ ఎడమ కాల్వలో బాలకృష్ణ దూకి నీటి ఉద్భృతికి కొట్టుకుపోతుండగా నందిని సైతం దూకింది. అదే సమయంలో విధులు ముగించుకుని అటుగా వెళ్తున్న హోంగార్డు వెంకట్ గమనించి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాడు. ఎస్సై క్రాంతికుమార్, సిబ్బందితో చేరుకుని వంతెన కింద నీళ్లలో తేలియాడుతున్న నందినిని స్థానికుల సాయంతో తాళ్లు అందించి కాపాడారు. గల్లంతైన బాలకృష్ణ ఆచూకీ లభ్యం కాలేదు. ఈ మేరకు నందిని నుంచి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.