రాష్ట్ర హైకోర్టులో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నమ్మించి అధిక మొత్తంలో సొమ్ము కాజేసిన నలుగురు మోసగాళ్ల మురాను పోలీసులు అరెస్టు చేశారు. తుళ్లూరు సీఐ దుర్గాప్రసాదు తెలిపిన మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఉద్యోగాలు ఉన్నాయంటూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన కందుకూరి కమల్, పాలేటి సత్యప్రసాద్, దాసి జయబాబు, ముప్పిడి జాన్ కెనడీ నకిలీ ఆర్డర్ పత్రాలు సృష్టించారు,
రాజమండ్రికి చెందిన యల్లా ఉమామహేశ్వరరావు, పోనంగి సత్యసాయి చక్రధర్, డొక్కు దివా కర్ తో పాటు మరికొందరికి వాటిని చూపి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని మోసం చేశారు. దీనిపై హైకోర్టు డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ కేఎస్వీ ప్రసాద్ ఫిర్యాదు చేశారు.
తుళ్ళూరు పోలీసులు కాకినాడ వెళ్లి గాలించి మోసగాళ్లను అదుపులో తీసుకున్నారు. సోమవారం నలుగురు నిందితులను మంగళగిరి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ వివరించారు.