మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుపై టీడీపీ నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. పరిధికి మించి రావెల కిషోర్ బాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్రం పరిధిలోనిదని... ఈ విషయంలో చంద్రబాబు గురించి తప్పుగా మాట్లాడితే సహించమని హెచ్చరించారు. ఇష్టముంటే పార్టీలో ఉండవచ్చని... లేకపోతే వెళ్లిపోవచ్చని చెప్పారు. పదవిలో ఉన్నప్పుడు ఒక మాదిరి, పదవి కోల్పోయిన తర్వాత మరోమాదిరిగా రావెల ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.తెలుగుదేశం పార్టీలో ఎవరైనా సరే క్రమశిక్షణను పాటించాల్సిందేనని... లేకపోతే చర్యలు తీసుకుంటామని వర్ల హెచ్చరించారు. మంద కృష్ణ మాదిగను రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వమని తామెన్నడూ అనలేదని చెప్పారు. తనకు పదవుల కన్నా ఎస్సీ వర్గీకరణే ముఖ్యమని రావెల కిషోర్ బాబు అన్న సంగతి తెలిసిందే. వర్గీకరణ కోసం అవసరమైతే శాసనసభ సభ్యత్వాన్ని సైతం వదులుకోవడానికి కూడా తాను సిద్ధమేనని చెప్పారు.