డియోరియా: ఉత్తర్ప్రదేశ్లోని డియోరియాలో ఇంటర్మీడియట్ చదువుతున్న 15ఏళ్ల విద్యార్థిని కళాశాల భవనం మీద నుంచి పడి చనిపోయింది. అయితే.. ఆమెను ఎవరో వెనక నుంచి తోసేసి ఉంటారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ సంఘటన జరిగినప్పటికీ మధ్యాహ్నం 3గంటల సమయంలో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది.
మోడ్రన్ మాంటిస్సోరి ఇంటర్ కాలేజీలో చదువుకుంటున్న నీతూ చౌహాన్ నిన్న ఉదయం 11 గంటల సమయంలో మూడో అంతస్తులోని బాత్రూమ్కు వెళ్లారు. కానీ కొద్దిసేపటికి ఆమె గ్రౌండ్ ఫ్లోర్లో రక్తపుమడుగులో కనిపించింది. గమనించిన కళాశాల యాజమాన్యం వెంటనే నీతూను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై పూర్తి విచారణ చేయాల్సిందిగా విద్యార్థిని తండ్రి పరంహన్స్ చౌహాన్ పోలీసులను డిమాండ్ చేశారు. ‘నీతూను ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో నా కుమారుడితో మాట్లాడింది. ఏమైందని తనని అడగ్గా.. ఎవరో మూడో అంతస్తు నుంచి తోసేసినట్లు చెప్పింది.’ అని తండ్రి చౌహాన్ చెప్పుకొచ్చాడు.
ఘటన ఎలా జరిగిందనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే.. కళాశాలలో సీసీటీవీ ఉన్నప్పటికీ అది పనిచేయకపోవడంతో ఘటనకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కావడం లేదని పోలీస్ అధికారి రాజీవ్ మల్హోత్ర తెలిపారు.