టీడీపీ కార్యాలయంపై దుండగులు దాడి చేయడంతో నిన్న ఏపీ బంద్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అయితే బంద్ విజయవంతం చేయడానికి టీడీపీ శ్రేణులు చేసిన విశ్వ ప్రయత్నాలను పోలీసులు నిలువరించారు. దీంతో ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 36 గంటల దీక్షకు దిగారు చంద్రబాబు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు వైసీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ వ్యాఖ్యలకు వైసీపీ నేత, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేయటానికి టీడీపీ నేతలకు సిగ్గుండాలని, రాష్ట్రంలో సీబీఐ అడుగు పెట్టడానికి వీలు లేదని తాను ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు జీవో తీసుకుని వచ్చిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఏ మొహం పెట్టుకుని సీబీఐ పేరు చెబుతున్నారని, ముఖ్యమంత్రి పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. లోకేష్ డ్రగ్స్ కు బానిస అయ్యారని, రాష్ట్రంలో మద్యం, డ్రగ్స్ దొరకకపోవటంతో ఫ్రస్టేషన్ లో ఉన్నాడని ఆరోపించారు.