మీకు ఏదైనా బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఉందా? రికరింగ్ డిపాజిట్ అంటే ప్రతీ నెల కొంత మొత్తంలో డబ్బును జమచేస్తూ ఉండటం. ప్రతీ నెలా అంతే మొత్తంలో జమ చేస్తూ ఉండాలి. మీరు జమ చేసే మొత్తం, ఎంచుకున్న కాలాన్ని బట్టి మీకు వడ్డీ వస్తుంది. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫ్లెక్సీ డిపాజిట్ స్కీమ్ ఉంది. ఇది కూడా రికరింగ్ డిపాజిట్ లాంటిదే. కానీ ప్రతీ నెల ఒకే మొత్తం జమ చేయాల్సిన అవసరం లేదు. అలాగని నెలకోసారి మాత్రమే జమ చేయాలన్న రూల్ కూడా ఏమీ లేదు. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఈ డిపాజిట్ స్కీమ్లో జమ చేయొచ్చు. ఏడాదిలో ఎన్నిసార్లైనా జమ చేయొచ్చు. అయితే ఆర్థిక సంవత్సరంలో ఎంత జమ చేయాలన్న లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ లోపు మీరు ఎన్నిసార్లైనా ఎస్బీఐ ఫ్లెక్సీ డిపాజిట్లో డబ్బులు జమ చేయొచ్చు.
ఎస్బీఐ ఫ్లెక్సీ డిపాజిట్ స్కీమ్లో ఆన్లైన్లో కూడా చేరొచ్చు. సింగిల్ లేదా జాయింట్గా ఈ స్కీమ్లో చేరొచ్చు. ఇందులో కనీసం రూ.500 జమ చేయాలి. అంతకన్నా ఎక్కువ జమ చేయాలంటే రూ.500 చొప్పున పెంచుకుంటూ పోవాలి. అంటే రూ.1000, రూ.1500, రూ.2000 ఇలా జమ చేయొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.5000 జమ చేయాలి. గరిష్టంగా రూ.50,000 మాత్రమే జమ చేయొచ్చు. కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 7 ఏళ్ల వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లకు ఎంత వడ్డీ రేటు ఉంటే రికరింగ్ డిపాజిట్ స్కీమ్కు అంతే వడ్డీ వర్తిస్తుంది. ప్రస్తుతం 5.4 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 0.50% శాతం అదనంగా వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేట్లను బ్యాంకు సవరిస్తూ ఉంటుంది. ఎస్బీఐ ఫ్లెక్సీ డిపాజిట్ స్కీమ్లో చేరిన తర్వాత మధ్యలో డబ్బులు కావాలంటే ఎలా అన్న సందేహం ఖాతాదారుల్లో ఉంటుంది. ఇందుకోసం ప్రీమెచ్యూర్ విత్డ్రాయల్ సదుపాయాన్ని కల్పిస్తోంది ఎస్బీఐ. రూ.5,00,000 లక్షల వరకు డిపాజిట్లపై ప్రీమెచ్యూర్ విత్డ్రాయల్ పెనాల్టీ 0.50% ఉంటుంది. రూ.5,00,000 కన్నా ఎక్కువ డిపాజిట్లకు 1 శాతం పెనాల్టీ వర్తిస్తుంది. లేదంటే డిపాజిట్పై 90 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు.