ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల విషయంలో కొన్నాళ్లుగా వివాదం నెలకొన్న సంగతి తెలిసందే. నీటి వాటాల విషయంలో రెండు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ విషయంపై ఎవరెన్ని మాట్లాడినా మౌనంగానే ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎశ్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా మాట్లాడారు. ఇటీవల తనపై విమర్శలు చేస్తున్న తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏపీ ప్రతిపక్ష నేతలకు కౌంటర్ ఇచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగిన రైతు దినోత్సవ సభలో పాల్గొన్న సీఎం జగన్.. తన ప్రసంగంలో నీటి వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజలాల విషయంలో పొరుగు రాష్ట్రం తెలంగాణతో గొడువలు జరుగుతున్నాయన్న సీఎం జగన్.. ఈ అంశంలో ప్రతిపక్ష నేతతో పాటు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు తనపై విమర్శలు చేస్తున్నారని జగన్ అన్నారు. వారందరికీ తాను ఒక్కటే చెప్పదలుచుకున్నానని.. ఆంధ్రప్రదేశ్ దశాబ్ధాలుగా కలిసిఉన్నప్పుడు రాయలసీమ, కోస్తాఆంధ్రా, తెలంగాణ కలిసే ఉన్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణలో ఏ ప్రాంతానికి ఎన్ని నీళ్లు కేటాయించారన్నది అందరికీ తెలుసన్నారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాజెక్టులు కడుతుంటే గాడిదలు కాస్తున్నారా..? అని ప్రశ్నించారు. రైతులు ఎక్కడైరా రైతే నీరు ఎఖ్కడైనా నీరే నీటి విషయాల్లో రాజకీయాలు జరుగుతుంటే చూడలేకపోతున్నామన్నారు జగన్. వైఎస్ఆర్ సీపీ గానీ, జగన్ గానీ కోరుకునేది ఒక్కటేనన్నసీఎం.. ఏ పొరుగు రాష్ట్రంతోనూ విభేదాలు కోరుకోవడం లేదన్నారు. అన్ని రాష్ట్రాలతో సఖ్యతతో ఉంటేనే మంచి వాతావరణం నెలకొంటుందని, తెలంగాణతో సఖ్యతతో ఉండాలని జగన్ కోరుకుంటున్నాడని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడూ వేలు పెట్టలేదని భవిష్యత్తులో కూడా జోక్యం చేసుకోబోమని జగన్ స్పష్టం చేశారు.