ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నోట్లరద్దు తర్వాత రూ.5వేల కోట్ల పట్టివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 22, 2017, 02:51 PM

నల్లధనాన్ని బయటకు తెచ్చేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతేడాది నవంబర్‌లో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి రూ. 5వేల కోట్లకు పైగా అప్రకటిత ఆదాయం బయటపడిందట. ఈ మేరకు ఆర్థికశాఖ శుక్రవారం పార్లమెంట్‌కు వెల్లడించింది. నవంబర్‌ 8 నాటి నుంచి దేశవ్యాప్తంగా చేపట్టిన వేల సోదాల్లో రూ. 5400 కోట్లకు పైగా అప్రకటిత ఆదాయాన్ని ఐటీశాఖ వెలికితీసిందని ఆర్థికశాఖ పేర్కొంది.


‘నవంబర్‌ 9,2016 నుంచి జనవరి 10, 2017 వరకు 1,100లకు పైగా ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. బ్యాంకు ఖాతాల్లో అధిక మొత్తంలో డబ్బు జమచేసిన వారిలో అనుమానాస్పదంగా ఉన్న ఖాతాలపై 5వేలకు పైగా నోటీసులు జారీ చేసింది’ అని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఈ సోదాల్లో రూ. 610కోట్లకు పైగా విలువైన వస్తువులు. రూ. 513కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేగాక, రూ. 110కోట్ల కొత్త కరెన్సీ నోట్లను కూడా జప్తు చేసినట్లు పేర్కొన్నారు. రూ. 5400కోట్ల అప్రకటిత ఆదాయాన్ని గుర్తించి బయటకు తీసినట్లు అర్జున్‌ రామ్‌ వెల్లడించారు. ఇక గతేడాది నవంబర్‌ 9 నుంచి ఈ ఏడాది జులై 14 వరకు రూ. 11.24కోట్ల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించినట్లు తెలిపారు.


ఇక ఆపరేషన్‌ క్లీన్‌ మనీలో భాగంగా ఇటీవలే 5.56 లక్షల బ్యాంకు ఖాతాదారులతో రెండో జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఖాతాల్లో అధికమొత్తంలో డబ్బు జమచేయడం, పన్ను వివరాలు తదితర విషయాలపై వీరిని ఐటీశాఖ వివరణ కోరింది. తొలి జాబితాలో 17.92లక్షల ఖాతాదారుల జాబితాను విడుదల చేసింది. అయితే ఇందులో 1.04లక్షల మంది సంబంధిత వివరాలు ఇవ్వలేదని ఐటీశాఖ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com