న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ హిందూ దేవతలపై అవమానక రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇవాళ రాజ్యసభలో మాట్లాడుతూ హిందూ దేవతలను మద్యం బ్రాండ్లతో పోల్చారు. ఆ వ్యాఖ్యల పట్ల బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను కించపరిచారంటూ బీజేపీ ఎంపీలు అన్నారు. ఎంపీ నరేశ్ అగర్వాల్పై వెంటనే చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గో సంరక్షణ పేరుతో జరుగుతున్న దాడుల అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ఎంపీ అగర్వాల్ ఈ వివాదాదస్పద వ్యాఖ్యలు చేశారు. దేవతలను అవమానించడం సరికాదు అని బీజేపీ నేతలన్నారు. అయితే అగర్వాల్కు అండగా మరో ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ నిలిచారు. ఒకవేళ సమావేశాలను పూర్తిగా రద్దు చేసినా, అగర్వాల్ మాత్రం క్షమాపణలు చెప్పరని అన్నారు. పార్లమెంట్ బయట ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే, కోర్టు కేసు ఎదుర్కొనేవాడని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అయితే అగర్వాల్ తాను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పారని, ఈ విషయాన్ని వదిలేయాలని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ అన్నారు. గందరగోళం మధ్య సభను వాయిదా వేశారు.