'ప్రధాన్ మంత్రి జన-ధన్ యోజన' (పీఎంజేడీవై) కింద పీఎంజేడీవై ఖాతాదారులకు ఉచిత రూపే డెబిట్ కార్డులను రూ.లక్ష ప్రమాద బీమా కవరేజీతో అందిస్తున్నది కేంద్ర సర్కారు. 2018 ఆగస్టు 28 తర్వాత తెరిచిన పీఎంజేడీవై ఖాతాదారులకు ఈ కవరేజ్ మొత్తాన్ని రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచింది. అర్హతగల పీఎంజేడీవై ఖాతాదారులందరూ ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై), ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పథకాలలోనూ నమోదు కావొచ్చుని కేంద్ర సర్కారు పేర్కొన్నది. పీఎంఎస్బీవై కింద రూ.రెండు లక్షలప్రమాద బీమా కల్పిస్తారు.
ఇందుకు ఖాతాదారులు 18 సంవత్సరాల నుంచి70 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వార్షిక ప్రీమియం రూ.12 లుగా ఉంటుంది. ఖాతాదారుడు తమ సమ్మతి తెలియజేస్తే బ్యాంక్ ఖాతా నుండి ప్రీమియం మొత్తం ప్రతి ఏడాది ఆటో డెబిట్ అవుతుంది. పీఎంజేజేబీవై కింద రూ.రెండు లక్షల మేర జీవిత బీమాను కల్పిస్తారు. ఇందుకు ఖాతాదారులు 18 సంవత్సరాల నుంచి 50 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన వారై ఉండాలి. దీనికి గాను వార్షిక ప్రీమియం రూ.330గా ఉంటుంది. ఖాతాదారుడు తమ సమ్మతి తెలియజేస్తే బ్యాంక్ ఖాతా నుంచి ప్రీమియం మొత్తం ప్రతి ఏడాది ఆటో మెటిక్ గా డెబిట్ అవుతుంది.