ఏపీలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నేడు సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు జిల్లాలో భారీ వర్షం పడింది. ఈ వర్షం ధాటికి ఏలూరు జిల్లాలోని లింగపాలెం మండలం యడవల్లి గ్రామానికి చెందిన పరస రామారావు (41) పిడుగుపాటుతో మృతి చెందారు. పశువులను మేపడం కోసం పొలంలో ఉండగా ఈ ఘటన జరిగింది. పిడుగు పాటుకు పశువులు సైతం మృతిచెందినట్లు తెలుస్తోంది. కాగా.. జిల్లాలోని ముసునూరు మండలంలో ఈదురుగాలులు భీభత్సం సృష్టించాయి. వందల ఎకరాల్లో అరటిపంట నేలకూలింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.