దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. వరుసగా నాలుగో రోజు 62 వేలకు పైగా పాజిటివ్ కేసులతోపాటు, ఎనిమిది వందలకు పైగా మరణాలు నమోదయ్యాయి. తాజాగా రికార్డు స్థాయిలో వెయ్యికి పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాలు 44 వేలు దాటాయి.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,007 మంది కరోనా బాధితులు మరణించారు. ఇంతపెద్ద సంఖ్యలో కరోనా బాధితులు మరణించడం ఇదే మొదటి సారి. అదేవిధంగా నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు 62,064 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 22,15,075కు పెరగగా, మరణాలు 44,386కు చేరాయి. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 6,34,945 కేసులు యాక్టివ్గా ఉండగా, 15,35,744 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 15 లక్షలు దాటిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో 80 శాతం పది రాష్ట్రాల్లోనే ఉన్నాయని తెలిపింది.
దేశవ్యాప్తంగా నిన్నటివరకు 2,45,83,558 కరోనా టెస్టులు చేశామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. ఆగస్టు 9న 4,77,023 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.