వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి కేసులో పోలీసులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. కోటంరెడ్డి ని అరెస్టు చేస్తారంటూ వార్తలు రావటంతో ఎమ్మెల్యే ఇంటి వద్దకు శనివారం అర్ధరాత్రి దాటాక భారీగా వైసిపి కార్యకర్తలు చేరుకోవటంతో అరెస్టు ను అడ్డుకొనేలా హైడ్రామా చోటు చేసుకుంది. కోటంరెడ్డి నివాసముండే చిల్డ్రన్స్ పార్కు వద్దనున్న సాయి ఆశ్రయ అపార్ట్మెంట్ కు పోలీసులు చేరుకుని దాదాపు గంటసేపు చర్చించారు. అనంతరం ఆయన పోలీసులతో కలసి బైటకొచ్చి మీడియాలో మాట్లాడుతూ తాను ఎంపీడీవో ఇంటికి వెళ్లాననడం అబద్దమని అయినా తను దాడి చేసానని కేసు పెట్టడం ఏంటని కోటంరెడ్డి నిలదీసారు. ఈ విషయంలో తన తప్పేమీ లేదన్న ధైర్యంతో తను ఉన్నానని, విచారణలో వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. అనుమతులు ఉన్నా ఎంపీడీవో వాటర్ కనెక్షన్ ఉద్దేశ పూర్వకంగానే ఇవ్వలేదని ఆ ఆరోపించారు. ఏది ఏమైనా పారదర్శకత పాలన అందించేందుకే తనని అరెస్టు చేయాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. తనపై జరుగుతున్న కుట్ర కోణాన్ని ఆరా తీయాలని పోలీసులను కోరుతున్నానని, తను తప్పు చేసినట్టు విచారణలో తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.