లక్ష్మి కటాక్షం ఎవ్వరికీ ఏ విధంగా వస్తుందో తెలియదు. రూ. 70 పెట్టి కొన్న లాటరీ టికెట్ ఆ రిక్షావాలా భవిష్యత్ నే మార్చేసింది. పక్క రాష్ట్రం లాటరీ టికెట్టు తన జేబులో అమాంతం 50 లక్షల రూపాయలు వేసింది.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్కు చెందిన గౌర్ దాస్ అనే వ్యక్తి రిక్షా తొక్కుకుని జీవనం సాగిస్తున్నాడు. అతనికి లాటరీలు కొనడం ఒక అలవాటు. ఇదే కోవలో నాగాలాండ్స్ స్టేట్ లాటరీ కొనుగోలు చేశాడు. ఇందులో ఆదివారం తీసిన డ్రాలో గౌర్ దాస్ 50 లక్షల రూపాయలు గెలుచుకున్నట్లు లాటరీ యాజమాన్యం ప్రకటించింది.
సెప్టెంబర్ 29 తన జీవితాన్ని మార్చిన రోజని, ఈరోజుని తానెప్పుడూ మరువబోనని గౌర్ దాస్ అంటున్నాడు. లాటరీ టికెట్టు ఖరీదు 70 రూపాయలని గౌర్ తెలిపాడు. వాస్తవానికి ఆదివారం నాడు రిక్షా యూనియన్ అంతా కలిసి పిక్నిక్ వెళ్లాలని అనుకున్నారు. అయితే లాటరీ తగలడంతో గౌర్, పిక్నిక్ వెళ్లలేదు. తన కుటుంబంతో కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటానని అతడు పేర్కొన్నాడు.