తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటు వెలికితీత కార్యక్రమం కొనసాగుతోంది. బోటును బయటికి తీసేందుకు నేటికి మూడు రోజులుగా ధర్మాడి సత్యం బృందం చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. తొలిరోజు లంగరుకు బరువైన వస్తువు తగలడం, ఐరన్ రోప్ సైతం తెగిపోవడంతో అది కచ్చితంగా బోటు అయ్యుంటుందని భావించారు. దాంతో రెండో రోజు బోటు బయటికి తీయడం సాధ్యపడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ధర్మాడి సత్యం బృందం ప్రయత్నాలు ఫలించలేదు.
రెండోరోజు, మూడో రోజు ఎన్ని ప్రయత్నాలు చేసినా లంగరుకు ఎలాంటి వస్తువు తగలకపోవడంతో అందరిలోనూ నిరాశ నెలకొంది. ఒక్కసారి లంగరుకు వస్తువు తగిలితే దానిచుట్టూ రోప్ తో రౌండప్ చేసి పైకి లాగాలన్నది ధర్మాడి సత్యం బృందం ప్లాన్. కానీ, ఓసారి తగిలినట్టే తగిలి రోప్ తెగిపోవడంతో ఉసూరుమన్నారు. దానికి తోడు ఈ సాయంత్రం కురిసిన వర్షంతో వెలికితీత నిలిచిపోయింది.