ఈ నెల 21 నుంచి 27 వరకు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలోని హ్యూస్టన్, న్యూయార్క్ నగరాల్లో పర్యటించనున్నారు. 21న ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న మోదీ హ్యూస్టన్ నగరానికి చేరుకుంటారు. హ్యూస్టన్లో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ నేతలతో కలిసి ప్రసంగిస్తారు. మరుసటి రోజు ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న వాతావరణ సదస్సులో ప్రసంగిస్తారు. ఇదే సదస్సులో ఆరోగ్యం, ఉగ్రవాదం అంశాలపై తన వివరణ తెలుపుతారు. తరువాత ప్రవాస భారతీయులతో ఆయన సమావేశమవుతారు. 24న ఐరాస సెక్రటరీ జనరల్ ఇచ్చే విందుకు హాజరవుతారు. ఐక్యరాజ్యసమితి ప్రాగణంలో మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా మోదీ 150 మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమంలో ఇండియా ప్రధానితో పాటు ఐక్యరాజ్యసమితి బృందం కూడా మొక్కలు నాటుతుంది. ఈ పర్యటనలో భాగంగా మోదీ ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రతినిధి బృందాలతో చర్చలు జరుపుతారు. 27న తిరిగి భారత్కు తిరిగి వస్తారు.