హెల్మెట్ వాడకుండా రూల్స్ అతిక్రమించిన వారికీ పోలీసులు హెల్మెట్లను గిఫ్టుగా ఇస్తున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రూల్స్ పాటించని బైకర్లకు జరిమానా విధిస్తూనే హెల్మెట్లు పంచుతున్నారు. అయితే, భువనేశ్వర్ ట్రాఫిక్ పోలీసులు మాత్రం జరిమానా వసూలు చేస్తూనే బైకర్లకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. కల్పనా స్క్వేర్ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించని బైకర్లకు రూ.500 జరిమానా విధిస్తున్నారు. అనంతరం వారికి హెల్మెట్లు ఇస్తున్నారు. ఈ సారి హెల్మెట్ ధరించకుండా బైకు నడిపితే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ‘‘ఈ కొత్త చట్టం ఆదాయం కోసం రూపొందించినది కాదు. ప్రజల భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై చైతన్యం కలిగించే ఉద్దేశంతోనే అమల్లోకి తెచ్చాం. నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు’’ అని తెలిపారు. ఒడిశా ట్రాఫిక్లు చేపట్టిన ఈ కార్యక్రమంపై నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మిగతా రాష్ట్రాల పోలీసులు కూడా ఇదే తరహాలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు. కేవలం ఆదాయంపైనే దృష్టిపెట్టకుండా అప్పడప్పుడు ప్రజలకు ఉపయోగపడే పనులు కూడా చేయాలని కోరుతున్నారు.