వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిపాలన లక్షణాలు లేవని, పల్నాడును వైసీపీ ఎమ్మెల్యేలు రావణకాష్టం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులతో రౌడీ దర్బార్ నిర్వహించారని, హోంమంత్రి రాష్ట్రాన్ని రక్షించకుండా వైసీపీ రౌడీదర్బార్లో పాల్గొన్నారని ఎద్దేవా చేశారు. అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశాక గెజిట్ నోటిఫికేషన్ ఎందుకని ప్రశ్నించారు. మంత్రి బొత్స సత్యనారాయణ తన ఛాంబర్ ఎక్కడ ఉందో చూసుకోవాలన్నారు. ముందు సన్నబియ్యం.. ఆ తర్వాత నాణ్యమైన బియ్యమంటూ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందన్నారు. శ్రీకాకుళంలో పంపిణీ చేసిన బియ్యాన్ని సీఎం తీసుకుంటారా? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. బియ్యం, పెన్షన్లో రాళ్లు వేశారని, నవరత్నాల్లో మిగిలిన రాళ్ళు ఎప్పుడు ఇస్తారో! నని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం వంద కార్లతో ఛలో ఆత్మకూరు కార్యక్రమం నిర్వహిస్తామని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.