ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వైసీపీ నేతలు జగన్పై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే.. టీడీపీ నేతలు మాత్రం మీడియా ముందుకొచ్చి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జగన్ పాలనపై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ను చేయిపట్టి నడిపించేవాడు కావాలని జేసీ చెప్పుకొచ్చారు. ప్రతి అంశాన్ని మైక్రోస్కోపులో చూసి లోపాలను సరిదిద్దాలి.. అంతేగాని దాన్ని నేలకేసి కొట్టొద్దని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. కొత్తగా ఉద్యోగాలు సృష్టించలేదు కానీ.. అలాంటప్పుడు ఆర్టీసీని తెచ్చి నెత్తిమీద పెట్టుకోవడం అదనపు భారమేనని జేసీ జోస్యం చెప్పారు. అంతటితో ఆగని ఆయన.. ‘మా వాడు చాలా తెలివైనవాడు..’ అంటూ వైఎస్ జగన్కు జేసీ కితాబిచ్చారు. రాజధాని అమరావతిలోనే ఇక్కడే ఉంటుందని.. ఎక్కడికీ తరలిపోదని మాజీ ఎంపీ జేసీ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.