జార్ఖండ్లోని జాదూగోడా పరిధిలోని రాఖామాండ్సా రైల్వేస్టేషన్లోకి చొరబడిన ఒక వానరం కలకలం సృష్టించింది. మధ్యాహ్నం 2 గంటలకు స్టేషన్ కార్యాలయంలోకి ప్రవేశించిన ఆ వానరం సుమారు 2 గంటలపాటు అక్కడి సిబ్బందిని హడలెత్తించింది. ఆ వానరం ఏకంగా ప్యానల్ బోర్డుపై కూర్చొని సిబ్బంది కార్యకలాపాలకు అడ్డుతగిలింది. వానర చేష్టలకు భయపడి కొంతమంది పారిపోయారు. మరోవైపు ఆ సమయంలో అటువైపుగా రైళ్ల రాకపోకలు లేకపోవడంతో పెనుప్రమాదమేదీ జరగలేదు. సిగ్నలింగ్ వ్యవస్థను పర్యవేక్షించే ఉద్యోగి కూడా వానరానికి భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. కాగా ఈ విషయమై స్టేషన్ అధికారి మోనామీ సింగ్ మాట్లాడుతూ వానరం కార్యాలయంలోకి ప్రవేశించి గందరగోళం సృష్టించడంతో సిబ్బంది భయపడిపోయారని అన్నారు. రెండు గంటల తరువాత అది అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నామన్నారు.