మండపేట: చిన్న పిల్లలు విషయ తీవ్రత తెలియకుండా చేసే పనులు కొన్నిసార్లు నవ్వుతెప్పిస్తాయి. ఇటీవల కిడ్నాప్కు గురై క్షేమంగా ఇంటికి చేరిన జషిత్ కూడా ఇటువంటి పనే చేశాడు. ఆ బుడతడు ఇంటికి చేరుకోగానే మీడియా అతన్ని చుట్టుముట్టింది. మీడియా వారు ఏవేవో ప్రశ్నలు అడిగారు.. జషిత్ కూడా ఉత్సాహంగా సమాధానం చెప్పాడు. ఇంతలో ఒక విలేకరి అత్యుత్సాహంగా కిడ్నాపర్లు నీకు తెలుసా అని ప్రశ్నించాడు. దీనికి జషిత్ కొన్ని క్షణాలు ఆలోచించి.. మాటల మధ్యలో ‘ఇద్దరిలో ఒకరిపేరు తెలీదు.. ఒకరి పేరు తెలుసు’ అన్నాడు. వెంటనే అలర్ట్ అయిన మీడియా ప్రతినిధులు ఆ కిడ్నాపర్ పేరు చెప్పమని అడిగారు. దీనికి స్పందించిన జషిత్ ‘మీకు చెప్పను .. మా ఫ్రెండ్స్తో మాత్రమే షేర్ చేసుకుంటా’ అని ముద్దుముద్దుగా సమాధానమివ్వడంతో అక్కడ నవ్వులు వెల్లివిరిశాయి. అనంతరం చిన్నారి జషిత్పై మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు సంధించారు. వీటిల్లో కొన్నిటికి ఉత్సాహంగా సమాధానం చెప్పాడు. తనను కిడ్నాప్ చేసే విధానాన్ని కూడా చకచకా చెప్పేశాడు. చాలా ప్రశ్నలకు ‘నాకేం తెలుసు’ అనే సమాధానమిచ్చాడు.
తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని లక్ష్మీనగర్ కాలనీ అపహరణకు గురైన నాలుగేళ్ల బాలుడు జషిత్ కథ సుఖాంతమైంది. పోలీసుల వెతుకులాటతో భయపడిపోయిన దుండగులు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రాయవరం మండలం కుతుకులూరి శివారులోని ఇటుకబట్టి వద్ద వదిలి వెళ్లారు. చిన్నారి ఏడుపు విని అక్కడి కూలీలు జషిత్ను చేరదీశారు. రాత్రంతా తమ వద్దే ఉంచుకున్నారు. ఆకలితో ఉన్న చిన్నారికి ఫలహారం పెట్టి చిన్నారి తండ్రికి సమాచార మందించారు. వీడియో కాల్ ద్వారా జషిత్ను నిర్ధారించుకున్న ఆయన తండ్రి పోలీసుల సాయంతో చిన్నారిని పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ నయీం అస్మి బాలుడిని తల్లికి అప్పగించారు.