కర్ణాటక రాజకీయాలు మూడు వారాల పాటు అనేక మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగాయి. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో నిలదొక్కుకోగానే కర్ణాటకపై పావులు కదిపింది. దీంతో అక్కడి జేడీఎస్, కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలను కాపాడుకోలేక చతికిల్లపడి ఓటమి పాలైంది. గత నెలలో 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ సర్కార్ సంక్షోభంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. బలపరీక్షపై జులై 18న ప్రారంభమైన చర్చ సుదీర్ఘంగా మంగళవారం రాత్రి వరకు కొనసాగింది. రాత్రి జరిగిన బలపరీక్షలో కుమారస్వామి ప్రభుత్వం ఓటమి పాలైంది.సభలో 204మంది సభ్యులు ఉండగా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా 99మంది మాత్రమే మద్దతు తెలపడంతో 103మ్యాజిక్ ఫిగర్ ముందు ఓటమి చవిచూసింది. 105మంది శాసనసభ సభ్యులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో స్పీకర్ ఫలితాలను ప్రకటించగానే బీజేపీ ప్రభుత్వం సంబురాల్లో మునిగిపోయింది. మే 23, 2018లో కుమారస్వామి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి 14నెలలు కొనసాగారు.