సెల్ఫోన్ ఓ పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. భార్య దొంగచాటుగా ఫోన్ మాట్లాడిందని అనుమానం పెంచుకున్న భర్త.. కొడవలితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా సంఘటివారిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ప్రస్తుతం బాధితురాలు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళ్తే.. సంఘటివారిపల్లిలో స్వాతి-రమణయ్య అనే దంపతులు చాలాకాలంగా నివసిస్తున్నారు. సాఫీగా సాగిపోతున్న వీరి కాపురంలో సెల్ఫోన్ చిచ్చు పెట్టింది.
ఇటీవల ఓరోజు స్వాతి.. ఆమెకు వరుసకు సోదరుడైన వ్యక్తితో ఫోన్లో మాట్లాడింది.అయితే ఆమె పక్కకు వెళ్లి మాట్లాడటం రమణయ్యలో అనుమానం కలిగించింది. రమణయ్య ఆమెను నిలదీయగా.. అసలు తానెవరితో ఫోన్ మాట్లాడలేదని చెప్పింది.దీంతో ఆమెపై మరింత అనుమానం పెంచుకున్న రమణయ్య.. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమెకు కుడిచేతికి తీవ్ర గాయమైంది. స్వాతి గట్టిగా కేకలు పెట్టడంతో రమణయ్య అక్కడినుంచి పారిపోయాడు.బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు కాలేదని సమాచారం.