సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ముందు బుధవారం రాత్రి నుండి లెక్కింపు పూర్తయ్యేవరకు మద్యం దుకాణాలు, బార్లు మూసివేస్తున్నట్లు ఎక్సైజు డిప్యూటీ కమిషనర్ రాధయ్య ప్రకటించారు. మంగళవారం రాధయ్య విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో 352 మద్యం దుకాణాలు, 46 బార్లను బుధవారం రాత్రి నుండి మూసివేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. బుధవారం రాత్రి నుండి 23 న గురువారం ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు మద్యం అమ్మకాలు నిలిచిపోతాయని వివరించారు. వీటిపై అన్ని ఎక్సైజు స్టేషన్ల సిఐ లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇప్పటికే దీనిపై నెల్లూరు, గూడూరు ఎక్సైజు సూపరింటెండెంట్లు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. నిబంధనల ఉల్లంఘన చేసి మద్యం అమ్మకాలు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ రాధయ్య హెచ్చరించారు.