కేంద్ర రక్షణ శాఖ బాధ్యతలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అప్పగించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి పదవికి మనోహర్ పారికర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గోవా ముఖ్యమంత్రిగా ఆయన పదవీబాధ్యతలను స్వీకరించబోతున్నారు. పారికర్ రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఆయన గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి రక్షణ మంత్రిగా అదనపు బాధ్యతలను అప్పగించారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత కేబినెట్ లో కీలక మార్పులు జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.