చెన్నై : డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్(65) బుధవారం రాత్రి అపోలో ఆస్పత్రిలో చేరారు. కిడ్నీ సంబంధిత సమస్యతో స్టాలిన్ బాధపడుతున్నట్లు డీఎంకే ప్రిన్సిపల్ సెక్రటరీ టీఆర్ బాలు మీడియాకు వెల్లడించారు. సాధారణ చెకప్లో భాగంగానే స్టాలిన్ ఆస్పత్రిలో చేరాడని స్పష్టం చేశారు. రాజకీయాల్లో బిజీగా ఉన్న కారణంగా గత రెండు నెలల నుంచి మెడికల్ చెకప్ చేయించుకోలేదని తెలిపారు. స్టాలిన్ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ఇక కుడి తొడలో చిన్న కణితి ఉన్నందున అది తొలగించేందుకు సర్జరీ చేస్తున్నట్లు అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు స్టాలిన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని ప్రకటించారు. ఆగస్టు 7వ తేదీన కరుణానిధి మృతి చెందడంతో.. ఆగస్టు 28న స్టాలిన్ను డీఎంకే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.