ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పనివేళలలో సిబ్బంది బయటకు వెళ్లకుండా అలా తాళం వేశారు

national |  Suryaa Desk  | Published : Mon, Jun 05, 2023, 09:47 PM

తాజాగా ఓ కంపెనీ తన చర్యలతో విమర్శలకు గురవుతోంది. ఇదిలావుంటే ఇండియన్ ఎడ్ టెక్ స్టార్టప్ సంస్థ కోడింగ్ నింజాస్ కంపెనీ.. తన ఉద్యోగులను బయటకు వెళ్లకుండా కార్యాలయానికి తాళాలు వేయడంపై విమర్శలు ఎదుర్కొంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లింక్డిన్, ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ఇది వైరల్ గా మారింది. ఈ వీడియోలో సెక్యరిటీ గార్డు ఆఫీస్ మెయిన్ డోర్ కు తాళం వేస్తున్నట్లుగా ఉంది. ఇదేమిటని అడిగితే అనుమతి లేకుండా ఏ ఉద్యోగిని బయటకు పంపించవద్దని మేనేజర్ చెప్పారని, బయటకు వెళ్లడానికి అనుమతి తప్పనిసరి అని సదరు సెక్యూరిటీ గార్డ్ చెప్పినట్లుగా ఆ వీడియోలో ఉంది. మేనేజర్, కంపెనీ యాజమాన్యం ఆదేశాలతో ఇలా తాళం వేశారు.


విమర్శలు రావడంతో కోడింగ్ నింజాస్ కూడా ఈ అంశంపై స్పందించింది. వరుసగా ట్వీట్లు చేసింది. తమ నాలుగు కార్యాలయాలలో ఒక దానిలో ఈ ఘటన జరిగిందని, ఒక ఉద్యోగి చేసిన విపరీత చర్య కారణంగా ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. అయితే కొన్ని క్షణాల్లో దానిని సరిదిద్దామని, సదరు ఉద్యోగి తన పొరపాటును అంగీకరించి, క్షమాపణలు కూడా చెప్పాడని వెల్లడించింది. కార్యాలయానికి తాళం వేయడంతో ఉద్యోగులకు కలిగిన అసౌకర్యానికి కంపెనీ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. ఇలాంటిది పునరావృతం కాదని తెలిపింది. అలాగే సదరు ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.


ఇది ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదని, ఇది తమ విలువలకు విరుద్ధమని కోడింగ్ నింజాస్ తెలిపింది. అసౌకర్యానికి గురైన ఉద్యోగులందరికీ క్షమాపణలు చెప్పింది. కోడింగ్ నింజాస్ సంస్థను 2016లో స్థాపించారు. సంస్థ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఈ ఎడ్ టెక్ సంస్థ మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఆండ్రాయిడ్ తదితర 17 ప్రోగ్రామింగ్ అండ్ డెవలప్ మెంట్ కోర్సులను నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో 150 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com