బెంగళూరు: ఆరెస్సెస్, బీజేపీ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉన్నదని శ్రీరామ్సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముథాలిక్ ఆరోపించారు. వీహెచ్పీ నేత ప్రవీణ్ తొగాడియా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు తనకూ ఉన్నాయని ఒక ఆంగ్ల టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కర్ణాటకలో ఆరెస్సెస్ అగ్రనేత మంగేశ్ భెండేకు నేనంటే ఇష్టం లేదు. ఆయనకు మాజీ సీఎం జగదీశ్ షెట్టర్, ధార్వాడ్ ఎంపీ ప్రహ్లాద్ జోషి మద్దతు ఉంది. ఉత్తర కర్ణాటకలో నా ఉనికే ఉండకూడదని వారు భావిస్తున్నారు అని చెప్పారు. 2009లో మంగళూర్ పబ్పై దాడి ఘటనతో వెలుగులోకి వచ్చిన ముథాలిక్.. నా సొంత మనుష్యులు అనుకున్న వారు నాకు లభిస్తున్న ప్రజాదరణను ఓర్వకపోవడం నాకు ఆందోళన కలిగిస్తున్నది అన్నారు. ఇతరులు ఎవ్వరూ పేరు తెచ్చుకోవడం వారికి ఇష్టం ఉండదు. వారిది బానిస మనస్తత్వం. వారితో కలిసి, వారు లేకుండా నేను చాలా సాధించా. సంస్థను వీడటానికి కారణం ఇదే అన్నారు. ఇటీవలే శివసేనలో చేరిన ముథాలిక్ ఆ పార్టీ కర్ణాటక శాఖ అధ్యక్షుడిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం నేర్పేందుకు 50 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు.