అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. దుద్యాల గ్రామానికి చెందిన రైతు కొప్పుల దానమయ్య (53) తనకు ఉన్న ఎకరా పొలంతోపాటు ఆరు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని మొక్కజొన్న, పత్తి, తదితర పంటలు సాగు చేసేవాడు. పంటల సాగు నిమిత్తం దాదాపు రూ. 6 లక్షల వరకు అప్పు చేశాడు. ఆశించిన స్థాయిలో పంటల దిగుబడి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి వేధింపులు అధికం కావడంతో గత ఏడాది తనకున్న ఎకరా పొలాన్ని అమ్మేశాడు. అయినా అప్పులు తీరకపోవడంతో తీవ్రమనస్తాపానికి గురైన దానమయ్య కౌలుకు తీసుకున్న వ్యవసాయ పొలంలో పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆయనను ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు వెళ్తుండగా పాములపాడు సమీపంలో మరణించాడు. దానమయ్యకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య యశోదమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.