తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆ ప్రేమికులిద్దరూ తాము ప్రయాణించిన కారుపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. ఉడుపి జిల్లా బ్రహ్వార తాలూకా హెగ్గుంజె గ్రామ సమీపంలో కారు మంటల్లో కాలిపోవడాన్ని చూసిన స్థానికులు మంటల్ని అదుపులోకి తెచ్చారు. అప్పటికే ప్రేమికులిద్దరూ అగ్నికి ఆహుతయ్యారు. మృతులను బెంగళూరుకు చెందిన యశ్వంత్, జ్యోతి గా పోలీసులు గుర్తించారు.
యశ్వంత్, జ్యోతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో జ్యోతి, యశ్వంత్ శనివారం రాత్రి మంగళూరు చేరుకున్నారు. అక్కడే ఓ కారును అద్దెకు తీసుకుని ఉడుపికి బయల్దేరారు. అంతకు కొద్ది సేపు ముందే తాము ఆత్మహత్య చేసుకోనున్నట్లు ప్రేమికులిద్దరూ తమ కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం. వారు అప్రమత్తమయ్యేలోపే ఆదివారం తెల్లవారుజామున కారుపై పెట్రోలు పోసుకుని లోపల కూర్చుని నిప్పంటించుకున్నారు. బ్రహ్మావర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.