పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలోని ఖ్యాలా గ్రామంలో పొలంలో ఆడుకుంటూ 100 అడుగుల లోతున్న బోరుబావిలో పడి ఆరేళ్ల బాలుడు ఆదివారం మృతి చెందాడు. గంటల తరబడి ఆ బాలుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎన్డిఆర్ఎఫ్) బృందాలు, భారత సైన్యం రంగంలోకి దిగి బాలుడిని బావిలో నుంచి బయటకు తీశాయి. అయినప్పటికీ అతడి ప్రాణాలు దక్కకపోవడంతో విషాదం అలముకుంది.
పొలంలో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడు హృతిక్ వీధి కుక్కలను చూసి కంగారు పడ్డాడు. అవి వెంటపడడంతో పరుగులు పెట్టాడు. ఈ క్రమంలో జనపనార సంచితో కప్పిన బోరుబావిలో ప్రమాదవశాత్తూ పడిపోయాడు. దాడి లోతు సుమారు 100 అడుగులు ఉంది. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగారు. బోరు బావిలో పడిన చిన్నారికి ఆక్సిజన్ సరఫరా చేస్తూనే, బోరుబావికి సమాంతరంగా సొరంగం తవ్వారు. అత్యవసర సేవల కోసం వైద్య బృందాలు కూడా వచ్చాయి. కొన్ని గంటల పాటు శ్రమించి బాలుడిని బయటకు తీశారు. అయితే అప్పటికే ఆ బాలుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఆసుపత్రిలో చేర్చిన కొద్ది సేపటికే కన్నుమూశాడు. బాలుడి కుటుంబానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంతాపం తెలిపారు. బాలుడి కుటుంబానికి రూ.2 లక్షల సాయం ప్రకటించారు. ఈ దుఃఖ సమయంలో తామంతా వారికి అండగా ఉంటామని తెలిపారు.