ఇండియన్ ప్రిమియర్లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ నేటి నుంచి పునః ప్రారంభం కానుంది. సీజన్-14 లో మిగిలిన 31 మ్యాచ్లు యూఏఈ వేదికగా జరగనున్నాయి. రెండో దశలో తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. దుబాయి ఇంటెర్నేషన్ స్టేడియం లో ఈ మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
ముంబై, చెన్నై జట్ల మధ్య ఇప్పటివరకు 32 మ్యాచ్లు జరగ్గా ముంబై 19, చెన్నై 13 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఈ సీజన్ లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు నిర్దేశించిన 219 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై జట్టు ఛేదించింది. ఆ మ్యాచ్లో కీరన్ పొలార్డ్ విధ్వంస ఇన్నింగ్స్ ఆడి ముంబై ఇండియన్స్ కి ఒంటిచేత్తో విజయాన్నందించాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు పాయింట్ల పట్టికలో చెన్నై రెండో స్థానంలో ఉండగా.. ముంబై నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ కి చేరాలంటే ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకమే. ఐపీఎల్ ముగిసిన అనంతరం ఈ వేదికలపైనే టీ20 వరల్డ్ కప్ జరగనుంది.