కరోనాతో ఓ వైపు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తుంటే మరో వైపు ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం డబ్బుల కోసం ఎంతకైనా తెగబడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి డబ్బులు తీసుకుని పరీక్షలు చేయకుండానే నెగటీవ్ రిపోర్టులు ఇస్తున్న ఓ ఆస్పత్రి వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో స్పందించిన అధికారులు ఆ ప్రైవేటు ఆస్పత్రిపై ఉక్కుపాదం మోపారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడినందుకు ఆ ఆస్పత్రి లైసెన్సును రద్దు చేశారు. మీరట్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఆస్పత్రికి చెందిన సిబ్బంది రూ. 2500లకు కరోనా లేదని రిపోర్టిస్తామని బేరమాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. విషయం ఆరోగ్య శాఖ అధికారుల వరకూ వెళ్లడంతో వారు వెంటనే ఆస్పత్రి లైసెన్సు రద్దు చేసి..భవనానికి సీలు వేశారు. సంక్షోభ సమయంలో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి అనీల్ ధింగ్రా స్పష్టం చేశారు.