మిజోరం రాజధాని ఐజ్వాల్లోని హ్లీమన్ సమట్ల్యాండ్ రోడ్డులోని ఓ క్వారీలో కొండచరియలు విరిగిపడి వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. మిజోరాంలోని చంపాయ్, ఐజ్వాల్లో 12గంటల వ్యవధిలో రెండుసార్లు భూప్రకంపనలు సంభవించాయి. భూ శిలల సద్దుబాటు కారణంగానే క్వారీలో కొండచరియలు విరిగిపడినట్లు స్థానికులు భావిస్తున్నారు. చంపాయ్ దక్షిణ-నైరుతి ప్రాంతానికి 27కిలోమీటర్ల దూరంలో సోమవారం ఉదయం 4గంటల 10 నిమిషాలకు భూమి కంపించగా రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.5గా నమోదైందని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. ఐజ్వాల్కు తూర్పు-వాయవ్యంగా 25 కిలోమీటర్ల దూరంలో ఆదివారం సాయంత్రం 4గంటల 16 నిమిషాలకు భూకంపం సంభవించగా రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది.