భారత్ లో ఇప్పటి వరకు 17,656 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 2842 మంది కోలుకోగా 559 మంది మరణించారు. కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్ డౌన్ విధించింది. తెలంగాణ సర్కార్ మే 7 వరకు సడలింపులు లేని లాక్ డౌన్ విధించింది. అయితే మే మొదటి వారం తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తే జరిగే పరిణామాల పై ఇప్పటి నుంచే ఆందోళన మొదలవుతుంది. లాక్ డౌన్ ఎత్తివేసినా ప్రజా రవాణాకు మరో నెల రోజుల పాటు అనుమతించకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రజా రవాణా అయిన బస్సులు,రైళ్లు,విమానాలు ప్రారంభమైతే వ్యాధి విస్తరణ మరింత పెరిగే అవకాశం ఉంది. లాక్ డౌన్ ఎత్తేసినంత మాత్రాన కరోనా వైరస్ వ్యాప్తి ఆగిపోయిందని కాదు. ఈ వ్యాధి ప్రభావం మరో 6 నెలల వరకు ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీతో పాటు తెలంగాణ, ఏపీ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ రాష్ట్రాలలో వలస కూలీలు, ఉపాధి నిమిత్తం వచ్చిన వారు అనేక మంది ఉన్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత వీరంతా స్వరాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఉంది. వీరిలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా అది అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా రైళ్ల ప్రయాణాల ద్వారా వేల మందికి సోకే అవకాశం లేకపోలేదు. కరోనాకు మందు వస్తే తప్పా పూర్తి స్థాయిలో వైరస్ తగ్గుముఖం పట్టిందని భావించలేం. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్నా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఒక వేళ లాక్ డౌన్ ఎత్తేస్తే రాష్ట్రాల మధ్య రాకపోకలు ప్రారంభమవుతాయి. కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి ఎవరైనా ప్రయాణిస్తే వారికి కరోనా ఉంటే అది అందరికి సోకే ప్రమాదం ఉంది. అందుకే లాక్ డౌన్ ఎత్తేసినా ప్రజా రవాణాను ప్రారంభించవద్దని కేంద్ర ప్రభుత్వానికి పలువురు సిఫార్సు చేస్తున్నారు.తెలంగాణలో హైదరాబాద్,రంగారెడ్డి,మేడ్చల్,సూర్యాపేట,భువనగిరి లాంటి ప్రాంతాల్లో పాజిటివ్ కేసులున్నాయి. వరంగల్ రూరల్, యాదాద్రి, సిద్దిపేట, వనపర్తి జిల్లాల్లో అసలు కేసులే లేవు. లాక్ డౌన్ తర్వాత బస్సులు ప్రారంభమైతే ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. కరోనా ఎక్కువ ఉన్న జిల్లాలలో నుంచి ఎవరైనా ఈ ప్రాంతాలకు వస్తే కరోనా విస్తరించే అవకాశం ఉంది. కావున లాక్ డౌన్ ఎత్తేసినా ప్రజా రవాణాను కొంత కాలం పాటు ప్రారంభించకపోవడం ఉత్తమం. లేకపోతే ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత లక్షలాది మంది రోడ్ల మీదకు వస్తే కరోనా వైరస్ మరింత పెరుగుతుంది తప్పా తగ్గదు. అందుకే లాక్ డౌన్ ను ఎత్తేసినా ప్రజా రవాణాకు అనుమతివ్వకపోవడం ఉత్తమమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ ప్రజారవాణాకు కూడా అనుమతిస్తే లక్షలాది మందికి కరోనా వైరస్ సోకడం ఖాయమని తెలుస్తోంది.