వాళ్లిద్దరూ ఒకే స్కూల్ లో టీచర్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరి మధ్యా ఉన్న పరిచయం ప్రేమగా మారింది. అయితే అప్పటికే తనకి పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి.. కొత్తగా పరిచయమైన టీచర్ తో ప్రేమాయణాన్ని నడిపాడు ధనుంజయ్. ప్రేమికుడి వ్యవహారం తెలియకుండా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి అతనికి ఆర్థిక సాయం కూడా చేస్తూ వచ్చింది రాణి. రాణికి మరో ఊరు ట్రాన్స్ ఫర్ కావడంతో ఇద్దరి మధ్య ఎడబాటు వచ్చింది. దీంతోపాటు పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తప్పించుకు తిరుగుతుండే సరికి అనుమానంతో రాణి ఎంక్వయిరీ మొదలు పెట్టింది. మనోడి మొదటి పెళ్లి, పిల్లల వివరాలు తెలిశాయి. నిలదీస్తే నీకు దిక్కున్నచోట చెప్పుకోమని అన్నాడు ప్రియుడు. ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. చివరకు మోసాన్ని భరించలేక ప్రియురాలు విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లా యంల్లందూరులో జరిగింది. బేలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.