ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లీటర్‌ పాలు బకెట్‌ నీళ్లు కలిపి 81 మంది విద్యార్థులుకు..

national |  Suryaa Desk  | Published : Fri, Nov 29, 2019, 01:21 PM

ఉత్తరప్రదేశ్‌లోని సోనభద్ర జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో బకెట్ నీళ్లలో లీటరు పాలు కలిపి విద్యార్థులకు తాగేందుకు ఇచ్చిన ఘటన చోటు చేసుకుంది. దాదాపు 81 మంది విద్యార్థులకు ఆ నీళ్ల పాలను గ్లాసుల్లో ఇచ్చారు. మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా పోషకాహారం కోసం విద్యార్థులకు పాలు కూడా ఇవ్వాల్సి ఉంది. విద్యార్థులకు పాలు అందిస్తోన్న సమయంలో గ్రామ పంచాయతీ సభ్యుడు ఒకరు పాఠశాలకు వెళ్లగా.. విద్యార్థులకు నీళ్ల పాలు ఇస్తోన్న విషయాన్ని గుర్తించి, వీడియో తీశారు. ఈ ఘటనపై అధికారులను మీడియా ప్రశ్నించగా. పాల ప్యాకెట్లను సరఫరా చేయడంలో ఆలస్యమైందని, దీంతో తప్పిదం జరిగి ఉండొచ్చని చెప్పుకొస్తున్నారు.


తాము అదే రోజు మళ్లీ విద్యార్థులందరికీ సరిపడా పాలు పంపిణీ చేసినట్లు చెబుతున్నారు. తనకు ఒక ప్యాకెట్‌ పాలు మాత్రమే ఇచ్చారని, 81 విద్యార్థులకు వాటిని ఇవ్వాల్సి ఉంటుందని అందుకే తాను నీళ్లు పోయాల్సివచ్చిందని వంట మనిషి తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం ఖర్చు చేస్తోన్న కోట్లాది రూపాయలు దారి మల్లుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com