నేనో కీపర్ను. కేరళ జట్టుకు ఐదేళ్లుగా తాను వికెట్ కీపింగ్ చేస్తున్నా. జట్టు యాజమాన్యం ఆదేశిస్తే కీపింగ్ చేస్తా, లేదంటే ఫీల్డింగ్ చేస్తా అని కేరళ వికెట్ కీపర్, టీమిండియా యువ ఆటగాడు సంజు శాంసన్ తెలిపాడు. నేను చేయాలనుకున్నది ముఖ్యం కాదు. జట్టే నాకు ముఖ్యం అని పేర్కొన్నాడు. 2015లో జింబాబ్వేపై తొలి అంతర్జాతీయ టీ20 ఆడిన శాంసన్.. మళ్లీ భారత జట్టుకు ఆడలేదు. రాహుల్ ద్రవిడ్, గౌతమ్ గంభీర్ వంటి మాజీలు శాంసన్కు మంచి ప్రతిభ ఉంది అని అనేకసార్లు బాహాటంగానే చెప్పారు. ఇక దేశవాళీ క్రికెట్లో శాంసన్ సత్తా చాటడంతో.. ఇటీవలే బంగ్లాదేశ్ జట్టుతో ముగిసిన టీ20 సిరీస్కు ఎంపికయ్యాడు. అయితే తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. మరో అవకాశం ఇవ్వకుండానే వెస్టిండీస్ టీ20 సిరీస్ నుంచి తప్పించారు. అయితే గాయపడ్డ ఓపెనర్ శిఖర్ ధావన్ కోలుకొనేందుకు సమయం పడుతుందని తెలియడంతో మళ్లీ ఎంపిక చేశారు. తాజాగా సంజు శాంసన్ మీడియాతో మాట్లాడాడు. వికెట్ కీపింగ్ మీకు ఇష్టం ఉండదట అని ఓ విలేకరి ప్రశ్నించగా.. అది నిజం కాదు అని సమాధానం ఇచ్చాడు. 'కేరళ జట్టుకు ఐదేళ్లుగా వికెట్ కీపింగ్ చేశా. రంజీ ఫార్మాట్లోనూ కీపింగ్ చేశాను. ఐపీఎల్లోనూ నా జట్టు కోరిన ప్రతిసారీ కీపింగ్ చేశా. అందరికీ ఈ విషయం తెలుసు. జట్టు అవసరాల మేరకు నేను పనిచేస్తా' అని శాంసన్ తెలిపాడు. 'మైదానంలో నా అవసరం ఉందని యాజమాన్యం ఆదేశించినప్పుడల్లా ఫీల్డింగ్ చేశా. కీపింగ్, ఫీల్డింగ్ రెండింటికీ సంసిద్ధంగా ఉంటా. ఎందుకంటే.. జట్టు అవసరమేంటో తెలియదు కదా. జట్టు యాజమాన్యంలో ఏం ఆలోచిస్తుందో చెప్పలేను. నేనో కీపర్ను. జట్టు ఆదేశిస్తే కీపింగ్ చేస్తా, లేదంటే ఫీల్డింగ్ చేస్తా. నేను చేయాలనుకున్నది ముఖ్యం కాదు, జట్టే ముఖ్యం' అని శాంసన్ పేర్కొన్నాడు. ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్లో ధావన్ ఎడమ మోకాలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతడు కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని బీసీసీఐ తెలిపింది. దీంతో ధావన్ స్థానంలో సంజూ శాంసన్ను ఎంపిక చేసింది.