అతని ప్రేమ బాసలు నమ్మింది. పెళ్లి చేసుకుంటానని చెబితే జీవితాన్ని అర్పించింది. మోజు తీరాక ముఖం చాటేస్తే పోలీసులను ఆశ్రయించి పెళ్లి చేసుకుని పట్టుదల నెగ్గించుకుంది. తప్పో, ఒప్పో జీవితం గాడిలో పడిందని, ఇక హాయిగా సాగిపోతుందని భావించిన ఆమె భర్తలోని మృగాడు మరో రూపంలో దారుణానికి ఒడిగడతాడని ఊహించలేకపోయింది. కట్టుకున్నవాడే మత్తు మందిచ్చి తన స్నేహితులు నలుగురితో ఆమెపై అత్యాచారం చేయించాడు. దాన్ని వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచుతానని బెదిరించాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసిందీ ఘటన. అన్నీ కోల్పోయిన ఆమె ధైర్యం చేసి పోలీసులకు విషయం చెప్పడంతో భర్త రూపంలో ఉన్న మృగాడి దారుణం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే...సహరాన్పూర్ లో అబ్దుల్లా దంపతులు నివసిస్తున్నారు. అబ్దుల్లా ఓ యువతిని చాలా ఏళ్లు ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. మోజు తీరాక పెళ్లికి నిరాకరిస్తే బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఏడాది ఆగస్టు 16న వారిద్దరినీ ఒక్కటి చేశారు. అనంతరం స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వేరు కాపురం పెట్టారు.
కానీ తనను పోలీస్ స్టేషన్ కు ఈడ్చి బలవంతంగా పెళ్లి చేసుకుందన్న కక్షతో రగిలిపోయిన అబ్దుల్లా ఆమెపై మరో రూపంలో పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగా ఈనెల 3వ తేదీన ఆమె తినే ఆహారంలో మత్తుమందు కలిపాడు. ఆమె నిద్రలోకి జారుకోగానే తన స్నేహితులు నలుగురితో అత్యాచారం చేయించాడు. దాన్ని తాను వీడియో తీశాడు. మత్తు వదిలిన తరువాత ఏం జరగిందని భర్తను ఆమె నిలదీయడంతో జరిగిన అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది.
అయితే అబ్దుల్లా తెలివిగా భార్యకు ఆ వీడియో చూపిం చి బ్లాక్ మెయిల్ చేసి ట్రిపుల్ తలాఖ్ చెప్పి ఇంట్లో నుంచి గెంటేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచుతానని బెదిరించాడు. అయినా బాధితురాలు లెక్కచేయకుండా తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.