ఆంద్రప్రదేశ్ లోని విపక్ష టీడీపీలో ఎప్పుడు ఎవరు పార్టీ వీడతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతుండగా... తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూడా టీడీపీకి గుడ్ బై చెబుతారేమో అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆయనే గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. బుధవారం పొన్నూరు నియోజకవర్గంలో పార్టీ యువనేత లోకేశ్ పర్యటించారు. ఇసుక కొరతతో ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్య చేసుకున్న అడపా రవి కుటుంబాన్ని లోకేశ్ పరామర్శించారు. అయితే ఈ పర్యటనకు నరేంద్ర కుమార్ దూరంగా ఉండటంతో... ఆయన కూడా పార్టీ మారతారేమో అనే ప్రచారం మొదలైంది.
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు ధూళిపాళ్ల నరేంద్ర. గత ఎన్నికల్లోనూ నరేంద్ర గెలుస్తారని... ఆయన డబుల్ హ్యాట్రిక్ కొడతారని అంతా అనుకున్నారు. కానీ ఆయనకు ఈ సారి పరాజయం ఎదురైంది. టీడీపీ అధికారం కోల్పోయిన తరువాత పార్టీ వ్యవహారాలకు ధూళిపాళ్ల నరేంద్ర దూరంగా ఉంటూ వస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా లోకేశ్ పర్యటనకు ఆయన దూరంగా ఉండటంతో... ధూళిపాళ్ల కూడా చంద్రబాబుకు హ్యాండిస్తారా ? అనే చర్చ మొదలైంది. అయితే వ్యక్తిగత కారణాల వల్లే ధూళిపాళ్ల నరేంద్ర లోకేశ్ పర్యటనకు దూరంగా ఉన్నారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.