న్యూఢిల్లీ: ఎన్ సిపి అధినేత శరద్ పవార్ను 2011లో చెంపదెబ్బ కొట్టిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. యుపిఎ ప్రభుత్వంలో శరద్ పవార్ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు… 24 నవంబర్,2011న ఓ కార్యక్రమానికి హాజరైన శరద్ పవార్ను అర్విందర్ సింగ్(36) అనే వ్యక్తి చెంప దెబ్బ కొట్టాడు. శరద్ పవార్ను చెంపదెబ్బ కొట్టడంపై తానేమి బాధపడడం లేదన్నారు. ఇది చాలా చిన్న విషయంగా భావిస్తున్నానన్నారు. నిత్యావసర వస్తువులు సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉందని ఆ కోపంతోనే పవార్ పై దాడి చేశానని చెప్పాడు. ఘటన జరిగిన వెంటనే అర్విందర్పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు విచారణ కొనసాగుతుండగానే 2014లో తప్పించుకు పారిపోయాడు. ఓ పోలీస్ కానిస్టేబుల్ను దుర్భాషలాడిన కేసులో సైతం ఇతడు నిందితుడిగా ఉన్నాడు. ఇతడి ఆచూకీ కోసం పలుమార్లు గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. కాగా అర్విందర్ సింగ్ ఆచూకీపై తాజాగా విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి అరెస్ట్ చేశారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరుచగా కోర్టు అర్విందర్ సింగ్కు నవంబర్ 25వ తేదీ వరకు జ్యూషియల్ రిమాండ్ విధించింది.